హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : పేదలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే తమకు అన్యాయం చేస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలని మూసీ పరీవాహక కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘ప్రజలను రోడ్డున పడేయడమే ప్రజాపాలనా?’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు తమ ఇండ్లు కూల్చేస్తామంటే ఊరుకోవాల్నా?’ అని ప్రశ్నిస్తున్నారు. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఆగమవుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో మూసీ, హైడ్రా పేరిట పేదల బతుకులను సర్కార్ రోడ్డున పడేస్తున్నది. అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి కూల్చడం, దోచుకోవడం, దాచుకోవడం అనే తరహాలో కాంగ్రెస్ పాలన సాగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గాంధీ సరోవర్ పేరిట మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తున్నది. ఆయా ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, ఇండ్లను ఖాళీ చేయాలని భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసి వారిని మానసికంగా వేధిస్తున్నది.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు డీపీఆర్ లేకుండానే భూసేకరణకు సిద్ధమవుతున్నది. అసలు డీపీఆర్ లేకుండా భూసేకరణ ఎలా చేస్తారని బాధిత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నోటీసులు అందిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాలను అందించాలని కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే ఉన్న ఇండ్లను కూలుస్తామని బుల్డోజర్లను మీదికి పంపుతున్నదని నిప్పులు చెరుగుతున్నారు. రూ.500 కోట్లతో గాంధీ సరోవర్ పేరిట గాంధీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు తమ భూములను లాక్కోవడం ఎందుకని నిలదీస్తున్నారు. గాంధీ మీద సీఎం రేవంత్రెడ్డికి ప్రేమ ఉంటే ఆయన ఇంటి వద్ద పెట్టుకోవాలని, తమ ఇండ్లు కూల్చడమేమిటని మండిపడుతున్నారు. కాంగ్రెస్ స్వప్రయోజనాల కోసం పేదలను రోడ్డున పడేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను తీసుకొని సమానమైన భూమి ఇస్తారా? లేక ఇండ్లు కట్టించి ఇస్తారా? అనేది ఏదీ చెప్పకుండా ఖాళీ చేయాలని నోటీసులివ్వడంపై తీవ్రంగా ఆవేదనకు లోనవుతున్నారు.
రూ.500 కోట్లతో గాంధీ విగ్రహం కడుతామంటున్నరు. ఆ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటి ముందు పెట్టుకోమనండి. రేవంత్రెడ్డి గొప్పల కోసం మా బతుకులను రోడ్డున పడేస్తరా? గిసొంటి ప్రభుత్వాన్ని జీవితంలో ఎన్నడూ చూడలే. మీరు మూసీ సుందరీకరణ చేసుకోవడానికి వందలాది పేద కుటుంబాలను రోడ్డున పడేస్తరా? ఇదేనా ప్రజా పాలన అంటే? ప్రభుత్వమే ప్రజలను రోడ్డున పడేస్తుంటే మేం ఇంకెవరికి చెప్పుకోవాలె? కష్టపడి పైసాపైస కూడబెట్టుకుని ఇండ్లు కట్టుకుంటే ఇప్పుడు మీ ఇష్టానికి వచ్చి కూల్చేస్త్తామంటే చూస్తూ ఊరుకోమంటరా? మా ఇండ్లను కూల్చేస్తే ఉద్యమం చేస్తం. కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.