కొడుక్కి కిడ్నీ ఇచ్చి బతికించుకొన్న తండ్రి
బన్సీలాల్పేట్, మార్చి 12: గాంధీ దవాఖానలో ఓ యువకుడికి అరుదైన కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. వరంగల్కు చెందిన హరీశ్ కుమార్ (30) మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ గాంధీ దవాఖానలో చేరాడు. హరీశ్కు కిడ్నీమార్పిడి అవసరం కావటంతో, అతడి తండ్రి చంద్రమౌళి తన కిడ్నీని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. దాంతో గాంధీ దవాఖాన యూరాలజీ విభాగం వైద్యులు శుక్రవారం శస్త్రచికిత్స నిర్వహించి చంద్రమౌళి నుంచి కిడ్నీ తీసి, అక్కడికక్కడే హరీశ్కు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం తండ్రీకొడుకులు ఆరోగ్యంగా ఉన్నారని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు తెలిపారు. కరోనా తర్వాత గాంధీ దవాఖానలో చేసిన తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఇదేనని వెల్లడించారు. సర్జరీని విజయవంతంగా నిర్వహించిన గాంధీ, ఉస్మానియా వైద్యులను ఆయన అభినందించారు.