Srisailam | శ్రీశైలం : వినాయకచవితిని పురస్కరించుకుని ఆగస్టు 27వ తేదీన ప్రారంభమైన గణపతి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. ఈ ఉత్సవాలలో ప్రతిరోజు రత్నగర్భగణపతిస్వామివారికి, సాక్షిగణపతిస్వామివారికి, యాగశాలలో నెలకొల్పిన పంచలోహ వరసిద్ధి వినాయకస్వామివారికి, సాక్షిగణపతి ఆలయములో నెలకొల్పిన మృత్తికా గణపతికి వ్రతకల్ప పూర్వక పూజలు, మండపారాధనలు, ఉపనిషత్ పారాయణలు, జపానుష్ఠానాలు, గణపతి హోమం, సాయంకాలపూజలు నిర్వహించారు.
కాగా పూర్ణాహుతి కంటే మందుగా స్వామివారి ఆలయములోని రత్నగర్భగణపతి స్వామివారికి అలాగే సాక్షి గణపతి స్వామి వారికి, మృత్తికా గణపతి వారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ పూజల తరువాత యాగశాలలో నెలకొల్పబడిన పంచ లోహ వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా విశేష పూజలు జరిపించబడ్డాయి. అనంతరం లోకకల్యాణం కోసం జపాలు, నిత్యహోమ బలిహరణలను చేసి గణపతిహోమం, జయాది హోమం నిర్వహించారు.
తరువాత పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా వారికేళాలు పలు సుగంధద్రవ్యాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. తరువాత జరిగిన అవబృథంలో వరసిద్ధి వినాయకస్వామి పంచలోహమూర్తికి ఆలయ ప్రాంగణంలో గల మల్లికాగుండంలో వైదిక శాస్త్రోక్తంగా స్నపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమములో అధికారులు, అర్చకులు, వేదపండితులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
మృత్తికా గణపతికి నిమజ్జనోత్సవం
గణపతి నవరాత్రతోత్సవాల సందర్భంగా సాక్షి గణపతి ఆలయంలో నెలకొల్పబడిన మృత్తికా గణపతిస్వామి వారికి శుక్రవారం నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా మృత్తికాగణపతికి విశేషంగా పూజాదికాలు జరిపించబడ్డాయి.