పాలకుర్తి : తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం వావిలాల గ్రామంలో మూడు రోజులపాటు జరిగే జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అంతే ముఖ్యమని అన్నారు. పోటీల్లో గెలుపు, ఓటమిలు సహజమని అన్నారు. ఓడిపోతే బాధ పడకుండా ఛాలెంజ్ గా తీసుకుని ఆడాలని సూచించారు. సీఎం కేసీఆర్ క్రీడలను ప్రోత్సహించేందుకు గాను ప్రతి గ్రామంలో ఎకరం స్థలం కేటాయించి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు.
తాను గతంలో కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్ ఆటల్లో కెప్టెన్ గా ఉండేవాడినని, అప్పట్లో వాలీబాల్ జిల్లా స్థాయి అధ్యక్షుడుగా , ప్రధాన కార్యదర్శిగా కడియం శ్రీహరి ఉన్నామని గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న వల్మిడి గుట్ట మీద 3500 ఏళ్ల కింద వాల్మీకి రామాయణం రాశారని, వల్మిడినీ రూ.20 కోట్లతో అభివృద్ది చేశామని తెలిపారు. పురాతన కట్టడాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం కబడ్డీ పోటీలో పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నవీన్, సర్పంచ్ గంట పద్మాభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.