మీరు గెలిస్తే ఏమేం పనులు చేస్తారు?
ఇంతకు ముందు పనిచేసిన ఎంపీలు జహీరాబాద్ సమస్యలపై ఏనాడూ పార్లమెంట్లో మాట్లాడలేదు. వారి వ్యాపారాలను పెంచుకున్నారే తప్పఎలాంటి అభివృద్ధి పనులూ చేయలేదు. తెలంగాణ మేలు కోరే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రాష్ర్టానికి దక్కాల్సిన హక్కులు దక్కుతాయి. ప్రజలు ఆశీర్వదించి నన్ను పార్లమెంట్కు పంపిస్తే బీదర్ టు బోధన్ రైల్వే లైన్ను పూర్తి చేయిస్తా. జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి జాతీయ రహదారితో కనెక్టివిటీ పెంచడం నా ప్రధాన ఎజెండా. ఎంపీగా గెలిచాక సొంత నిధులతో పెద్ద సంఖ్యలో జాబ్ మేళాలు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా.
నిజామాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘గత ఎంపీలు అభివృద్ధిని పక్కనబెట్టి సొంత లాభం, కాంట్రాక్టుల కోసమే పనిచేసిండ్రు. ప్రజా సమస్యలపై ఎన్నడూ పార్లమెంట్లో మాట్లాడింది లేదు. జహీరాబాద్కు జాతీయ రహదారులతో పాటు రైల్వే కనెక్టివిటీని పెంచాల్సి ఉన్నది. బీదర్ టు బోధన్ రైల్వే లైన్ పూర్తిచేయాలి. నేను ఎంపీగా గెలిస్తే తప్పక సాధిస్తా’ అని జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ చెప్పారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, యువతకు పెద్ద సంఖ్యలో జాబ్మేళాలు పెట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే మోసాలకు కేరాఫ్ అని, రాష్ట్రంలో రైతులను కష్టాలు చుట్టుముట్టాయని ఆవేదన వ్యక్తంచేశారు.
దేవుళ్లపై ఒట్లు.. కేసీఆర్పై తిట్లు తప్ప కాం గ్రెస్ చేసేదేం ఉండదు. ప్రచారంలో కేవలం దూషణలు, ఒట్లతో సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నడు. ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేసి ఉంటే దేవుళ్లపై ఒట్లు పెట్టే అవసరం రాదు.. నమ్మకం లేకనే ఇలా ఒట్లు పెడుతున్నరు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసంబద్ధమైన హామీలు గుప్పించి ప్రజలను గందరగోళంలో పడేసి ఓట్లు వేయించుకున్నాక చేతులెత్తేసిన్రు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసే సీఎం రేవంత్రెడ్డి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నడు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, వరికి రూ.500 బోనస్, మహిళలకు నెలకు రూ.2,500, పింఛన్ రూ.4వేలు ఇస్తామని చెప్పి ఐదు నెలలవుతున్నా అమలు చేయకపోవడం వారి చేతగాని తనానికి నిదర్శనం. మోసం చేయడంలో రేవంత్ను మించినోళ్లు లేరు.
లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సహకారంతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాం.. మా పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శకంలో ప్రచారం జోరుగా నడుస్తున్నది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అండదండలు, ఎమ్మెల్యే మాణిక్ రావు, ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, క్రాంతి, భూపాల్ రెడ్డి, కార్యకర్తలంతా కలిసి పార్టీ విజయం, నా గెలుపు కోసం సైనికుల్లా పనిచేస్తున్నరు. ప్రచారంలో ప్రజలను కలిసినప్పు డు వారి కళ్లలో బాధ కనిపిస్తున్నది. కేసీఆర్ను అనవసరంగా ఓడగొట్టుకున్నామనే భావన వినిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాదనుకోలేదని వాళ్లంతా చెప్తున్నరు. ఈసారి మాత్రం కేసీఆర్కే మద్దతుగా నిలుస్తామని తెగేసిచెప్తున్నరు. రైతులైతే ఎప్పుడో డిసైడయ్యిం డ్రు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాధ అన్నదే తెల్వలేదు, కాంగ్రెస్ పాలకులు నరకం చూపిస్తున్నరని ఆవేదన చెందుతున్నరు. వాస్తవాలను రైతులు, సామాన్యులు గుర్తిస్తున్నరు. ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తరు.
నిరంతరం ప్రజల్లోనే ఉండి వారి సాధక బాధకాలను పంచుకుంట. ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే కేసీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లో వచ్చా. ప్రజల మద్దతుతో గెలిచిన వారికి ఏ కష్టం వచ్చినా తోడుంట. జహీరాబాద్ ప్రజలను నా కుటుంబ సభ్యుల్లా చూ సుకుంటా. గతంలో పని చేసి న ఎంపీల గురించి మాట్లాడుకోవడం వృథా. ఎన్నికలప్పుడే ప్రజల ముందుకొచ్చేవాళ్లను ప్రజలు తిరస్కరిస్తారు. సురేశ్ షెట్కార్, బీబీపాటిల్ను ఈ ప్రాంత ప్రజలు ఆదరించినా వారు నిలబెట్టుకోలేదు. పదేండ్ల పాటు ఎంపీగా ఉన్న బీబీపాటిల్కు ఇప్పటికీ ఏ ఊరు ఎక్కడుందో తెలియదు. పదవిని అడ్డం పెట్టుకుని పబ్బం గడపడం మినహా ప్రజలకు వాళ్లు చేసిన మేలేం లేదు. నిరంతరం ప్రజల్లో ఉండే నాకు వాళ్లు పోటీయే కాదు.