మర్కూక్, సెప్టెంబర్ 6: గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని, రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఎర్రవల్లి గ్రామస్థులు యాదగిరిగుట్ట వరకు పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి బుధవారం ఎర్రవల్లిలో ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎర్రవల్లి గ్రామస్థులు కొండపోచమ్మ వరకు పాదయాత్ర చేసి అమ్మవారికి ముడుపు కట్టారు. ఆ తర్వాత రెండోసారి కేసీఆర్ సీఎం కావాలని, కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయాలని పాదయాత్ర చేపట్టారు.
తాజాగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ గ్రామస్థులు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర ఎర్రవల్లి మీదుగా వర్ధరాజ్పూర్, ధర్మారం, వీరారెడ్డిపల్లి, ఇబ్రహీంపూర్, వెంకటాపూర్ నుంచి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకుంటుందని గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్య భిక్షపతి, ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మరాంచంద్రం, ఎంపీటీసీ ధనలక్ష్మీకృష్ణ, పీఎసీఎస్ వైస్ చైర్మన్ బాల్రాజ్, వెంకట్రెడ్డి, కనకయ్య, గ్రామ యువజన సంఘాల నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.