BRS | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సామాజిక సమతూకం పాటించారు. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు సామాజిక సమతూకం పాటిస్తూనే ప్రజాబలం ఉన్న నేతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇటీవలి అసెంబ్లీ ఫలితాల అనంతర పరిస్థితు ల్లో రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పాలనను ప్రజలు తిరిగి గుర్తు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యం లో పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే కొందరు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా వారికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నది. పార్టీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు అన్ని ఎంపీ స్థానాల్లో విస్తృత ప్రచారాన్ని చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రజా మద్దతును కూడగట్టనున్నారు.
రిజర్వ్ స్థానాల అభ్యర్థుల ఎంపికలోనూ కేసీఆర్ సమతూకం పాటించారు. ఎస్టీల్లో ఆదివాసీ, మైదాన గిరిజనులకు సమాన అవకాశాలు కల్పించారు. ఆదిలాబాద్ స్థానాన్ని ఆదివాసీ (గోండు) గిరిజనులకు, మహబూబాబాద్ను మైదానప్రాంత గిరిజనులకు (బంజారా/లంబాడా) కేటాయించటం విశేషం. ఎస్సీ నియోజకవర్గాల్లో రెండు స్థానాలను మాదిగ (నాగర్కర్నూల్, వరంగల్) సామాజిక వర్గానికి, పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించారు. తద్వారా సమాజంలోని అన్ని సామాజికవర్గాలకు తాము మాత్రమే అవకాశం కల్పిస్తామని బీఆర్ఎస్ మరోసారి నిరూపించిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రిజర్వ్స్థానాల్లో రెండింటిని వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) మహిళలకు కేటాయించడం మరో విశేషం.
బీఆర్ఎస్ ఈసారి ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లకు అవకాశం కల్పించింది. నాగర్కర్నూల్ లోక్సభ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మెదక్ స్థానానికి అదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసి, తన పదవికి రాజీనామా చేసి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన పీ వెంకట్రామ్రెడ్డిని కేసీఆర్ బరిలో నిలిపారు.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్యాదవ్ను పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో చర్చించిన అనంతరం కేసీఆర్ అభ్యర్థిని నిర్ణయించారు.
పార్టీ నిర్మాణంలో అయినా, అభ్యర్థుల ఎంపికలో అయినా సామాజిక సమతూకం అంటే బీఆర్ఎస్ పార్టీయేనని మరోసారి నిరూపించింది. ఎంపీ టికెట్లలో బీసీలకే సింహభాగం కల్పించింది. బీసీలకు ఆరు స్థానాలు కేటాయించింది. బీసీల్లో మున్నూరుకాపులకు రెండు (జహీరాబాద్, నిజామాబాద్) స్థానాలు కేటాయించింది. చేవెళ్ల స్థానాన్ని ముదిరాజ్లకు, సికింద్రాబాద్ను గౌడ సామాజికవర్గానికి, భువనగిరి స్థానాన్ని గొల్లకురుమలకు, హైదరాబాద్ స్థానాన్ని యాదవులకు కేటాయించింది. రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు, వెలమ, కమ్మ సామాజికవర్గాలకు ఒక్కో స్థానాన్ని కేటాయించింది.