హైదరాబాద్ : బీజేపీ మ్యానిఫెస్టోలో(BJP) చెప్పిందే చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఈ పదేళ్లలో బీజేపీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్(Gadari Kishore Kumar )అన్నారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు.
ప్రశ్నించే వాళ్లను అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలను తెలంగాణలో బొందపెట్టాలన్నారు.18 సంవత్సరాలు దాటినా మహిళకు 2500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంతవరకు ఆ హామీ గురించి మరిచిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి జిత్తులమారి నక్క.. జూబ్లీహిల్స్ సొసైటీలో బ్లాక్ మెయిల్ చేసి అక్రమంగా సంపాదించారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి అయినంక కూడా ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని విమర్శించారు. తన మీద చర్యలు తీసుకోకుండా ఉండేందుకు మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నాడు. అందుకే కాంగ్రెస్ పార్టీలో బలహీన అభ్యర్థులను పెట్టాడని చెప్పారు. కేసీఆర్, బీఆర్ఎస్ పేరు లేకుండా రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదని ఎద్దేవా చేశారు. లక్షల సిమ్ కార్డులు కొనుగోలు చేసి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు.
దానం నాగేందర్ జీవితాంతం పార్టీ పిరాయింపులేనని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్లు చిరుమల్ల రాకేష్, గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ధర్మేందర్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీష్, యుగేంధర్ రెడ్డి పాల్గొన్నారు.