సూర్యాపేట టౌన్, నవంబర్ 15: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లుగా కొనసాగుతున్న నిరంతర అభివృద్ధి పాలన కావాలో.. 60 ఏండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసిన అరాచకుల పాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్రెడ్డి సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముకుంటే బంగారు తెలంగాణను ఆగం చేయడంతోపాటు కారు చీకట్ల పాలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీతోనే నిరంతర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014కు ముందు విపక్షాల పాలనలో ఎంతో గోస పడ్డామని, నేడు బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా జీవిస్తున్నామని చెప్పారు.
అందుకే ప్రజలంతా గులాబీ జెండాను గుండెల నిండా నింపుకొని స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.