హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు హరితనిధిని ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. చెట్ల రక్షణ, అటవీ భూముల ఆక్రమణల నిరోధానికి రహస్య సమాచార నిధిని ఏర్పాటుచేసింది. ఈ రహస్య సమాచార నిధికోసం సీఎం కేసీఆర్ రూ.4.06 కోట్లు కేటాయించారని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. అడవుల రక్షణ, ఆక్రమణల నివారణ, వన్యప్రాణుల వేటను, స్మగ్లింగ్ను అరికట్టడంపై సమాచారం ఇచ్చేవారిని ప్రోత్సహించేందుకు ఈ నిధిని ఖర్చు చేయనున్నట్టు వివరించారు.
సోమవారం ఎంసీహెచ్చార్డీలో నిర్వహించిన వర్క్షాప్లో రహస్య సమాచార నిధి ఏర్పాటుపై చర్చించారు. ఈ నిధి నుంచి డివిజనల్ ఫారెస్ట్ అధికారి (డీఎఫ్వో) నేతృత్వంలో రూ.రెండు నుంచి మూడు లక్షలు, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్వో)కి రూ.3 నుంచి రూ.7లక్షలు, చీఫ్ కన్జర్వేటర్కి రూ.5 నుంచి రూ.13 లక్షలు, పీసీసీఎఫ్ రూ.50 లక్షల వరకు సమాచారం విలువ ఆధారంగా ప్రోత్సాహకాలు అందించే వీలుంటుంది. అడవుల రక్షణతోపాటు, అర్బన్ ఫారెస్ట్ పార్కులకు కూడా సమీప గ్రామాలు, కాలనీవాసులతో ప్రొటెక్షన్ కమిటీలను నియమించాలని నిర్ణయించారు. వర్క్షాప్లో సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, అటవీ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు తదితరులు పాల్గొన్నారు.