హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం పతాక స్థాయికి చేరుకున్నది. ప్రతి పెట్రోల్ బంకు ముందు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసి నా పెట్రోల్, డీజిల్ కొరతనే. ఒక్క లీటర్ పెట్రోల్ కోసం వాహనదారులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెజారిటీ పెట్రోల్ బంకుల్లో బుధవారం కూడా నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. అక్కడక్కడా పనిచేస్తున్న బంకుల్లో వాహనదారులు గంటల తరబడి భారీగా క్యూ కట్టారు. కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర లైన్లు కనిపించాయి. ముఖ్యంగా జీ హెచ్ఎంసీ పరిధిలో ఇంధన కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది. మేడ్చల్ నుంచి మెహిదీపట్నం వరకు, పటాన్చెరు నుంచి ఈసీఐఎల్ వరకు.. ఏ దిక్కున చూసినా వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం తీ వ్ర ఇబ్బందులెదుర్కొన్నారు.
ఓవైపు కరో నా పరిస్థితులు ఎదుర్కొనేందుకు మరోసారి సిద్ధంగా ఉండాలంటూ ప్రధాని మో దీ చేసిన వ్యాఖ్యలు, ఇంకోవైపు ఆయిల్ కంపెనీల ఆంక్షలు, షరతులు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలేమి వెరసి రాష్ట్రంలో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిస్థితులతో ఆందోళన చెందిన వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకులకు పరుగులు పెట్టారు. దీంతో బంకుల్లోని పెట్రోల్ నిల్వలు ఖాళీ కావడంతో నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల యాజమానులు బంకులను మూసివేశారు. ఇక తెరిచి ఉన్న బంకుల వద్ద వాహనదారులంతా ఎగబడ్డారు. కొన్ని చోట్ల క్యాన్లు, బాటిల్స్, స్టీల్ క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్లడం కనిపించింది. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
పోలీసుల పహారా, ఓన్లీ లిమిటెడ్ పెట్రోల్
కొన్ని పెట్రోల్ బంకుల్లో పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో పోలీసుల రంగప్రవేశం చేశారు. ప్రతి పెట్రోల్ బంకు వద్ద పోలీసుల పహారాలో విక్రయాలు చేపట్టారు. వీరితోపాటు సివిల్సప్లయ్ అధికారులు, తూనికలు, కొలతలశాఖ అధికారుల సైతం బంకుల వద్ద మానిటరింగ్ చేశారు. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో పెట్రోల్ పంపిణీపై ఆంక్షలు విధించారు. బైకులు, కార్లలో ఫుల్ ట్యాంకు చేయడాన్ని నిలిపేశారు. బైక్కు రూ.200, కార్లకు రూ.1000 విలువైన పెట్రోల్, డీజిల్ను మాత్రమే పంపిణీ చేశారు.
కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలి: రేవంత్
వంట గ్యాస్, పెట్రో ఉత్పత్తుల కొరత నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డిని ఓ మీడియా ప్రతినిధి.. ‘పశ్చిమాసియాతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచంతోపాటు భారతదేశానికి పెద్ద సవాలు ఎదురైంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ విపత్తును ఎదుర్కొనేందుకు మీరు చేపట్టనున్న కార్యాచరణ ఏమిటి?’ అని ప్రశ్నించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘గ్యాస్, పెట్రోల్ కొరత తీవ్రమవుతున్నందున ఇతిహాసాల్లో మాదిరిగా సూర్యభగవానుడిని ప్రార్థించి.. రాళ్లతో కొట్టుకుని అగ్గి పుట్టించి పొయ్యి వెలిగించుకుని వంట చేసుకుని తినేందుకు ప్రజలు సిద్ధం కావాల్సిందే..’ అని వ్యాఖ్యానించారు. సీఎం స్థాయి వ్యక్తి ఇంత నిర్లక్ష్యంగా, ప్రజల ఇబ్బందులను అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పైసలు కడితేనే సరఫరా.. డీలర్లపై కంపెనీల ఆంక్షలు
ప్రస్తుత పెట్రో సంక్షోభానికి సరఫరా కంపెనీల అనాలోచిత నిర్ణయాలు సైతం కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు క్రెడిట్(రుణం) విధానంలో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసిన కంపెనీలు ఉన్నపళంగా ఆ విధానాన్ని ఎత్తేశాయి. క్రెడిట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి అడ్వాన్స్ పేమెంట్ విధానాన్ని అమలులోకి తెచ్చాయి. లోడ్ కావాలంటే డీలర్లు ముందుగానే డబ్బులు చెల్లించాలని అంటున్నాయి. దీంతో ఆ బంకులకు కంపెనీలు సరఫరా నిలిపేయడంతో అవి మూతపడ్డాయి. దీనిపై ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు వెనక్కి తగ్గాయని, మళ్లీ క్రెడిట్ విధానంలో సరఫరాకు అంగీకరించాయని అధికారులు తెలిపారు.