హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : సహజంగా ఇంజినీరింగ్.. అగ్రికల్చర్.. ఫార్మసీ కోర్సుల్లో ఇంటర్ సెకండియర్ పూర్తిచేసిన వారే చేరుతారు. మొత్తంగా టీనేజర్లే అత్యధికంగా ఎప్సెట్కు దరఖాస్తు చేస్తారు. కానీ ఆరు పదులు, ఐదు పదుల వయస్సులవారు సైతం టీనేజర్లతో పోటీపడబోతున్నారు. మనుమలు, మనుమరాండ్ల వయస్సువారితో పోటీపడేందుకు సై అంటున్నారు. 65 ఏండ్లు, 59 ఏండ్ల వయస్సులోనూ ఫార్మసీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరుతామంటున్నారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్సెట్కు ఈ సారి కూడా వృద్ధులు దరఖాస్తుచేశారు. ఏకంగా 65 ఏండ్ల వయస్సు గల వ్యక్తి ఒకరు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి దరఖాస్తు చేశారు. ఎప్సెట్కు పోటీపడుతున్న వారిలో ఇతనే పెద్ద వయస్కుడు. ఇంజినీరింగ్ విషయానికి వస్తే 1960, 1980 సంవత్సరాల్లో జన్మించిన వారు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసేందుకు గరిష్ఠ వయోపరిమితి లేదు. 16 ఏండ్ల పైబడిన వారెవరైనా పోటీపడొచ్చు. దీంతో వయో వృద్ధులు సైతం దరఖాస్తు చేశారు.