హైదరాబాద్, మార్చి 4: (నమస్తే తెలంగాణ): గ్రంథాలయోద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లో పౌర పఠన మందిరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలోని 8 గ్రామాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ సౌజన్యంతో పౌర పఠన మందిరాలను ప్రారంభించారు. మరో 12 గ్రామాల్లో త్వర లో ప్రారంభించనున్నారు. ఆయా పంచాయతీల సహకారంతో వీటిని నిర్వహించనున్నారు. ఒక్కొక్క పఠన మందిరం నిర్వహణ కోసం నెలకు రూ.1,000, మ్యాగజైన్లు, వార్తాపత్రికల కొనుగోలు కోసం మరో రూ.1,000 కేటాయిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు వెలుడుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగార్థుల అవసరాలను తీర్చేలా వీటిని ఏర్పాటుచేస్తుండటం విశేషం. ఇటీవల ప్రారంభించిన పౌర పఠన మందిరాలకు ఔత్సాహికుల నుంచి విశేష స్పందన వస్తున్నది. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అమలుచేస్తున్నది. తొలి దశలో ఇప్పటికే నడుస్తున్న గ్రంథాలయాలను బలోపేతం చేయడం, భవనాల నిర్మాణం, వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. రెండో దశలో ఈ మందిరాలను ఏర్పాటు చేస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పుస్తక ప్రపంచం పేరుతో రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేస్తున్నారు. తొలి విడతలో 5 వేల పాఠశాలల్లో వీటిని ఏర్పాటుచేశారు. మరో 3 వేల పాఠశాలల్లో వీటిని ప్రారంభించనున్నారు. వీటి కోసం రూ.5 కోట్లు వెచ్చించి ఒక్కో స్కూల్కు 240 చొప్పున పుస్తకాలను సమకూరుస్తున్నారు. ఆకర్షణీయమైన బాల సాహిత్యాన్ని, కథల పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు.