ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముందు అధికారంలో ఉన్న 14 మంది ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే సుమారు రూ. 80 లక్షల కోట్లు అప్పు చేశారు. వడ్డీలకే వార్షిక రాబడిలో 37 శాతాన్ని ఖర్చు చేస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం.. కేంద్రప్రభుత్వం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదు.
మోదీ ప్రభుత్వం ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందని కాగ్ ఇటీవల కేంద్రాన్ని తలంటింది. అప్పులకు వడ్డీ చెల్లించేందుకే రాబడిలో 37 శాతం నిధులను వెచ్చిస్తున్న కేంద్రం.. రైతన్నలకు 4 శాతాన్ని ఎందుకు ఖర్చు చేయలేదని వ్యవసాయరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఎన్పీఏల పేరిట బ్యాంకులను లూటీ చేసిన కార్పొరేట్లకు ఏకంగా రూ.12 లక్షల కోట్లను మోదీ సర్కారు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. ఈ డబ్బుతో ఏకంగా పదేండ్లపాటు రైతన్నలకు ఉచిత విద్యుత్తు ఇవ్వొచ్చు కదా? అని నెటిజన్లు కేంద్రప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
ప్రపంచబ్యాంకు చెప్పిందీ అదే..
వ్యవసాయం లాభసాటిగా మారి రైతులు ఆర్థిక స్వావలంబన పొందేందుకు ప్రపంచబ్యాంకు భారత్ సహా 47 దేశాలకు 2019లో పలు సూచనలు చేసింది. వ్యవసాయరంగంలో 67 సంస్కరణలు చేయాలని పేర్కొన్నది. ఉచిత విద్యుత్తుతో అన్నదాతలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది.