హైదరాబాద్, ఫిబ్రవరి 8 : ఆదిలాబాద్లో పత్తి పరిశోధన కేంద్రం, తాండూరులో కంది విత్తన పరిశోధన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అరటి, మిరప, విత్తన పత్తి, కంది, మామిడి, ఆలుగడ్డతోపాటు ఇతర కూరగాయల సాగును మరింత ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ నేలలు, వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు తేల్చారని, ఆలు సాగును పెంచాలని అన్నారు. ‘తెలంగాణలో వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయ ప్రగతి, రైతులకు మరింత చేరువకావడం’ అనే అంశాలపై మంగళవారం ఆయన హైదరాబాద్లో వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు మరిన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. తెలంగాణలో వ్యవసాయం అత్యధిక లాభసాటి రంగంగా మారిందని చెప్పారు. కోహెడ మార్కెట్లోని పది ఎకరాలను కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కోసం వేర్హౌసింగ్ కార్పొరేషన్కు అప్పగించనున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ సోనా వరి, మహబూబాబాద్, ఖమ్మం మిరప, తాండూరు కంది, పాలమూరు వేరుశనగ, నిజామాబాద్ పసుపు, తెలంగాణ పత్తి, జగిత్యాల, కొల్లాపూర్ మామిడి వంటి ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించాలని అన్నారు.
6 నెలల్లో 4 ఆయిల్పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటు
ఆయిల్పామ్ సాగుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, రాబోయే ఆరు నెలల్లో నాలుగు ఆయిల్పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా వేంసూరులో ఆయిల్ఫెడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేటలో 60 ఎకరాల్లో, మహబూబాబాద్లో 84 ఎకరాల్లో ఆయిల్పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్పామ్ ఫ్యాక్టరీగా మార్చాలని సూచించారు. నారు నుంచి మొక్కలు నాటే వరకూ శాస్త్రీయ పద్ధతుల్లో నాణ్యతను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, వీసీలు ప్రవీణ్రావు, నీరజా ప్రభాకర్, వివిధ సంస్థల చైర్మన్లు కొండూరి రవీందర్రావు, మార గంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, సాయిచంద్, కొండబాల కోటేశ్వర్రావు, ఉన్నతాధికారులు లక్ష్మీబాయి, యాదిరెడ్డి, వెంకట్రామ్రెడ్డి, జితేందర్రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.