Telangana | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన నలుగురు ఎంపీలు గెలువగా, ముగ్గురు ఎంపీలు ఓటమిపాలయ్యారు. ఒక బీఆర్ఎస్ ఎంపీ, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు గెలిచిన వారిలో ఉండగా, బీజేపీ నుంచి ముగ్గురు తలపడి ముగ్గురూ పరాజయాన్ని చవిచూశారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ను ఓడించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండలో, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి హుజుర్నగర్లో, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి కొడంగల్లో విజయం సాధించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్లో, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుటల్లో, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బోథ్లో పోటీచేసి ఓడిపోయారు.
గతంలో పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహించినవారు తాజాగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, గతంలో పెద్దపల్లి ఎంపీగా పనిచేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఖమ్మం ఎంపీగా సేవలందించి కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహించి ఈ దఫాలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో కేసీఆర్ కూడా ఉన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్కాజిగిరి ఎంపీగా పనిచేశారు. మునుగోడు నుంచి గెలిచిన రాజగోపాల్రెడ్డి గతంలో భువనగిరి ఎంపీగా పనిచేశారు. వరంగల్ ఎంపీగా సేవలందించిన కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.