ములుగు: ములుగు (Mulugu) జిల్లా కేంద్రానికి సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జు అవగా, మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ, ఆటో డ్రైవర్ ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు మరణించగా, దవాఖానకు తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారని పోలీసులు తెలిపారు.
మృతులు మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), డ్రైవర్ జానీ (23) , వెన్నెల, రసూల్ గా గుర్తించారు. పల్లె బోయిన పద్మ, రసూల్, వెన్నెల, వసంత తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వీరంతా అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.