Pocharam Srinivas Reddy | హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ‘రాజకీయంగా కక్ష సాధించాలని మీకు ఉంటే మా మీద విచారణ చేపట్టండి. నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోండి. అంతేకానీ రైతుల మీద చూపెట్టకండి. రైతులకు యాసంగి నీళ్లు ఇవ్వండి’ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రిజర్వాయర్లలో యాసంగికి సరిపడా నీళ్లున్నాయని, వాటిని సకాలంలో రైతులకు విడుదల చేయాలని సూచించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య పాలనలో రాష్ర్టాన్ని ఎడారిగా మారితే కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ చేసేందుకు జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని తామే సభలో డిమాండ్ చేశామని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించి విచారణ చేస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు.
కేసీఆర్ గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించి 30 లక్షల ఎకరాలకు స్థిరీకరించడమే కాకుండా మరో 30 లక్షల ఎకరాల నూతన ఆయకట్టును సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేశారని చెప్పారు. రైతులకు రెండు పంటలు నీళ్లు ఇవ్వటం ద్వారా అద్భుతమైన పంటలు పండాయని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఏటా రెండు పంటలు పండేందుకు కారణం కేసీఆరేనని వెల్లడించారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా గోదావరి నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి రావటం వల్ల 1.30 లక్షల ఎకరాల యాసంగి పంటకు కూడా నీళ్లు అందుతున్నాయని తెలిపారు. సింగూరు పరిధిలో 40,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు అయినా గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయటానికి పరిమితమైందే తప్ప, రైతు పంటలకు నీళ్లు ఎలా ఇవ్వాలనే ఆలోచన చేయటం లేదని తప్పుబట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లలో 27 నుంచి 30 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, వీటితో 2.5 లక్షల ఎకరాల నుంచి 3 లక్షల ఎకరాల వరకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం నీటి విడుదలపై నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని పోచారం అన్నారు. ప్రభుత్వం నీటిని వదలకుండా భూములను పడావు పెట్టిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మీద కోపమెందుకని ప్రశ్నించారు. నీటి విడుదల చేయకపోతే యాసంగిలో ధాన్యం దిగుబడి తగ్గే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం, సాగునీటి శాఖ మంత్రి, అధికారులు తక్షణమే నిర్ణయం తీసుకుని నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 150 టీఎంసీలతోపాటు రాష్ర్టంలోని ఇతర ప్రాజెక్టుల్లోనూ సరిపడా నీరు ఉన్నదని చెప్పారు.
నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న నీటిని కాదని, 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయినా డ్యాం (మహారాష్ట్ర) నుంచి నీటిని తీసుకువస్తామని ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకోబోతున్నదని, దీని వల్ల నష్టమే కానీ లాభం లేదని పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. కొయినా డ్యాం నుంచి 30 టీఎంసీలు రాష్ర్టానికి చేరేసరికి 3 టీఎంసీలు కూడా అందవని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొరత ఏర్పడితే దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.