కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 7: కేవలం ఇంటిపేరు ఒక్కటైనందుకే బంధుత్వం అంటగట్టి విద్యుత్తు శాఖలో ఉద్యోగం ఇప్పించారంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్నికల వేళ తనను బద్నాం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ఈ తప్పుడు సమాచారంతో వార్తలను ప్రచారం చేసిన వారు ఉద్యోగం పొందిన అమ్మాయితో తనకు బంధుత్వం ఉన్నట్టు నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్లోని ప్రతిమ మల్టిప్లెక్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్తు సీఎండీ ప్రభాకర్రావు ఉద్యోగం ఇచ్చినట్టుగా చెప్తున్న బోయినపల్లి సరితకు, తనకు ఎలాంటి బంధుత్వమూ లేదని స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంటిపేరు ఒక్కటైనంత మాత్రాన బంధువులవుతారా? అంటూ ప్రశ్నించారు. దీనిని బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు సోషల్ మీడియాలో వైరల్ చేసి తనను బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలు వస్తున్నందునే తనపై బండి సంజయ్ కావాలనే వాళ్ల కార్యకర్తలతో ఇలాంటి చీప్ ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఒక వార్త ప్రసారం చేసేముందు సమగ్ర సమాచారం తెలుసుకోవాలని, ఆ తర్వాతనే దానిని పబ్లిష్ చేయాలని తీన్మార్ మల్లన్నకు హితవుపలికారు. కచ్చితమైన ఆధారాలు తెలుసుకోకుండా ఇలా వార్తలను ప్రసారం చేయడం జర్నలిజం అనిపించుకోదని సూచించారు. దీనిని ప్రసారం చేసే ముందు తనకు ఫోన్ చేసినా, కనీసం మెసేజ్ చేసినా సమాధానం ఇచ్చేవాడినని పేర్కొన్నారు. తన 20 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పును ప్రోత్సహించలేదని, చట్టవ్యతిరేకమైన పని చేయాలని ఏ అధికారినీ కోరలేదని వివరించారు. తనకు అన్నే లేడని, ఇక ఆ అమ్మాయికి తనకు బంధుత్వం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బోయినపల్లి ఇంటిపేరు ఉన్నంత మాత్రాన బంధుత్వం ఎలా అంటగడతారని ఫైర్ అయ్యారు. ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ దేశంలో రూ.లక్షల కోట్లు దండుకొని ఇప్పుడు లండన్లో ఉంటున్నారని, మరి ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ బంధువులు అవుతారా? అనే విషయాన్ని బీజేపీ సోషల్ మీడియా మిత్రులు గ్రహించాలని చురకలంటించారు. రాజకీయ పోరాటం ఉండాలి కానీ, తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని నిలదీశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు ఏం అభివృద్ధి చేశారు? ఏం పనులు చేశాం? అనే అంశాలపై మాట్లాడుకుందామని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర మేయర్ యాదగిరి సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ మేయర్ రవీందర్సింగ్, నాయకులు పాల్గొన్నారు.