కొండమల్లేపల్లి, ఏప్రిల్ 22 : అబద్ధాల హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా గ్యారెంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో ప్రజలకు ఇప్పటికే అర్థమైందని అన్నారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి కొండమల్లేపల్లి, పెద్దవూర, పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రాల్లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుబంధు, మహిళలకు రూ.2,500, ఆసరా పింఛన్లు రూ.4 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో సాగునీటి కష్టాలు పోయాయని, అప్పుడు నిండుకుండలా ఉన్న జలాశయాలు ఇప్పుడు ఎండిపోయి దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముకుంటే నట్టేట ముంచుతాయని హెచ్చరించారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.