మంచిర్యాల, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్సభ ఎన్నికల కోడ్ను సాకుగా చూపి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎగగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లోపు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి వేముల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రజాదర్బార్లో ఒక్కరోజు అర్జీలు స్వీకరించిన రేవంత్రెడ్డి ఇప్పుడూ పత్తాలేకుండా పోయాడని విమర్శించారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని విమర్శించిన కాంగ్రెస్.. తమ ప్రభుత్వం ఏర్పాటైన 50 రోజుల్లోనే రూ.14 వేల కోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. ప్రజలను కేసీఆర్ కలవడం లేదని పనిగట్టుకొని విష ప్రచారం చేసిన మీడియా సంస్థలు ఇప్పుడు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నుంచి వెంటనే ఇస్తామన్న రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతు భరోసా, రూ.4 వేల పింఛన్, రూ.2,500 మహాలక్ష్మి పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్చేశారు. ఇవేవీచేయకుండా పైసా ఖర్చు లేని ఉచిత బస్సు పథకాన్నే కాంగ్రెస్ అమలు చేస్తున్నదని విమర్శించారు. రాహుల్గాంధీ జోడో యాత్ర చేస్తుంటే ఇండియా కూటమిలోని నాయకులు ఒక్కొక్కరుగా ఛోడో యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కర్ణాటకలో 22 ఎంపీ సీట్లలో సున్నా నుంచి రెండు సీట్లు మాత్రమే గెలుస్తాయని సర్వేలు చెప్తున్నాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ను బొందపెట్టేవాడు ఇంకా పుట్టలేదని అన్నారు. బీఆర్ఎస్ను కనబడకుండా చేయడం నీ గురువైన చంద్రబాబు, నీ కంటే పెద్ద రెడ్డి రాజశేఖర్రెడ్డితోనే కాలేదన్నారు. తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా రేవంత్రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టంచేశారు.
మోదీ దోస్తు అదానీ కన్ను సింగరేణిపై పడిందని.. ఈ విషయంలో సింగరేణి కార్మికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సంస్థను కాపాడుకోవాలంటే మీ కోసం పోరాటం చేసే బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించుకోవాలని విజ్ఞప్తిచేశారు. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు తదితరులు పాల్గొన్నారు.