Srinivas Goud | గద్వాల, డిసెంబర్ 29 : తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులు, రాజకీయ నేతలందరినీ ఒకేలా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమేని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ స్వీకరించకపోవడం బాధాకరమని అన్నారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జములమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు. అనంతరం బీఆర్ఎస్ నేత బాసు హన్మంతు నాయుడి నివాసంలో మీడియాతో మాట్లాడారు. తిరుమలలో గతంలో ఉన్న సంప్రదాయాలను కొనసాగించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తిరుమలలో ప్రస్తుతం తెలంగాణ వాసులపై వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు.
తిరుమలకు వెళ్లే వారిలో తెలంగాణ భక్తులే అధికమని చెప్పారు. గతంలో టీటీడీ కల్పించిన సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ స్పందించి సిఫారసు లేఖలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జోగుళాంబ దేవికి దసరా ఉత్సవాల సమయంలో కర్నూల్ కలెక్టర్ పట్టువస్ర్తాలు సమర్పించేవారని.. తిరుమల ఉత్సవాల సమయంలో గద్వాల పట్టుపంచెలు స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.