హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు బదిలీ అయిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించిన దస్ర్తాలను హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకు మంగళవారం తరలించారు. కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి చార్జిషీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు సహా ఇతర దస్ర్తాలన్నింటినీ 3 ట్రంకు పెట్టెల్లో హైదరాబాద్కు తరలించారు. వివేకా హత్య కేసును ఢిల్లీ సీబీఐ విభాగం దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్, దస్తగిరిపై ప్రధాన చార్జిషీట్, దేవిరెడ్డి శంకర్రెడ్డిపై అనుబంధ చార్జిషీట్ను కడప జిల్లా సెషన్స్ కోర్టులో గతంలో సీబీఐ దాఖలు చేసింది. అయితే కేసు విచారణను ఏపీ నుంచి బదిలీ చేయాలన్న వైఎస్ వివేకానందారెడ్డి కుమార్తె సునీత అభ్యర్థన మేరకు.. తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఫైళ్లన్నీ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు దర్యాప్తు సంస్థ తెప్పించింది. తొలుత చార్జిషీట్లను పరిశీలించాలని న్యాయస్థానం కార్యాలయాన్ని ఆదేశించింది. పరిశీలన అనంతరం చార్జిషీట్కు నంబరు కేటాయించాక హైదరాబాద్లో విచారణ ప్రక్రియ ప్రారంభం కానుంది.