హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ (BRS) ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీ పడలేదని తెలిపారు. నీళ్ల విషయంలో తెలంగాణకు శాశ్వత ప్రయోజనాలు కలగాలని వెల్లడించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, పార్టీ నాయకుడు గెల్లు శ్రీనివాస్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల కోసం కేసీఆర్ ఎప్పుడూ పోరాడలేదనేది అవాస్తవమన్నారు. కేంద్ర షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నదని ప్రశ్నించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి వచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు ఒప్పుకున్నాయని కేంద్రం చెబుతున్నదని తెలిపారు.
ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ (KRMB) నిర్వహిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యాలు నెరవేరకపోగా నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తీసుకెళ్లడం సరికాదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రాజెక్టుల విషయంలో మంత్రుల ప్రకటన ఆశ్వర్యం కలిగిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీశైలం, సాగర్లను కేఆర్ఎంబీకి అప్పగిస్తే నిర్మాణం కావలసిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు తప్పవని, ప్రతి విషయంలో కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు. ఆంధ్ర ప్రయోజనాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హామీల అమలుపై ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. ప్రాజెక్టుల్లో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, యాసంగికి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పచ్చని పంటలతో రాష్ట్రం పచ్చబడుతున్నదని, యాసంగి సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డివి అసంబద్ధ వ్యాఖ్యలని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరుకు జాతీయ హోదాపై ఎందుకు నోరుమెదపడం లేదని నిలదీశారు.