వనపర్తి : రైతులను రోడ్లపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి( Niranjan Reddy) అన్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ(Loan waiver) చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిచాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు నేడు గుర్తిస్తున్నారని చెప్పారు.
రుణమాఫీతో రైతుల ఆశలు ఆవిరి అయ్యాయి. తప్పుడు లెక్కలతో రుణమాఫీ చేయకుండా మాయ చేస్తున్నారని ఆరోపించారు. రైతులు తీసుకున్న రుణాలు, చేసిన మాఫీకి, ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఎలాంటి పొంతన లేదని మండిపడ్డారు. కేసీఆర్ను నమ్మినంత వరకు రాష్ట్రంలో రైతులకు ఏ కష్టం రాలేదు. కాంగ్రెస్ మాటలతో ప్రజలు నిండా మునిగారన్నారు. రైతులే రుణమాఫీ మాట మారుస్తున్న రేవంత్రెడ్డి సర్కారు మెడలు వంచుతారన్నారు. రైతుల ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.