హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): భారతరత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించడమంటే దేశ ప్రజలను, భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ తీరే అంత అని, మొదటి నుంచి అంబేద్కర్ను అవమానిస్తూనే వచ్చిందని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్ను గౌరవించలేదని, ఎన్నికల్లోనూ ఆయనను ఓడించారని గుర్తుచేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అతిపెద్ద విగ్రహానికి ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించకపోవడమే కాకుండా, ప్రాంగణం గేటు మూసివేసి అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు.
వారు నివాళులు అర్పించకపోవడమే కాకుండా ప్రజలు, ప్రజాసంఘాలకు కూడా ఆ అవకాశం ఇవ్వకుండా స్మృతివనానికి తాళం వెయ్యడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. చేసిన తప్పునకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ భారీ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించడం వల్లే అలా వ్యవహరిస్తే, అదే కేసీఆర్ కట్టిన సచివాలయంలోనూ కూర్చోవడం మానేయాలని, కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ భగీరథ నుంచి తాగునీరు ఇవ్వకుండా మరో వ్యవస్థ ద్వారా నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ మరణం తర్వాత నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు మనసు రాలేదని మండిపడ్డారు. దళితులను, మైనార్టీలను కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా భావిస్తున్నదని, ఆ పార్టీపై ఎవరికైనా భ్రమలు ఉంటే తొలగించుకోవాలని నిరంజన్రెడ్డి సూచించారు.
తమ పోరాటం ఇకపై బీజేపీపైనేనని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పడం హాస్యాస్పదమని నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు ఆయనకు అర్థంకావని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓట్లు, సీట్లు మాత్రమే తెలుసని విమర్శించారు. కాంగ్రెస్ ‘మిషన్ 15’ అంటున్నదని, ఆ పార్టీకి చేతనైతే పక్కన ఒకటి తీసేసి 5 సీట్లలో గెలవాలని సవాలు విసిరారు. అసెంబ్లీలో కేసీఆర్ ఒక్కరుగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పనిపట్టి మెడలు వంచారని గుర్తుచేశారు. ఎన్నికల తర్వాత ఎవరేంటో తెలుస్తుందని చెప్పారు. వేణుగోపాల్కు చేతనైతే రేవంత్ సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, ఆయన ఇన్చార్జిగా ఉన్న చేవెళ్ల, సొంతస్థానం మహబూబ్నగర్లో పార్టీని గెలుపించుకోవాలని సవాలు విసిరారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీ పాలనను గాలికి వదిలేసి కండువాలు కప్పడంలో బిజీగా ఉందని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. యాసంగి ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తారా? ఇవ్వారా? స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల పేరుతో ఎగ్గొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ హయాంలో కనుమరుగైన ట్యాంకర్లను కాంగ్రెస్ మళ్లీ తీసుకొచ్చిందని, ఒక్క మార్చి నెలలోనే హైదరాబాద్లో 1.75 లక్షల నీటి ట్యాంకర్లను వాడారని, ఇవి ప్రభుత్వ ట్యాంకర్ల లెక్కమాత్రమేనని తెలిపారు. పంటలు ఎండుతుంటే సీఎం ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్తారని, కాంగ్రెస్ మంత్రులు, సీఎం చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారని నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు.