హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా పార్టీలు మారుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై కడియం చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన శుక్రవారం ఖండించారు. కడియం తన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, కేసీఆర్కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అన్ని రకాల పదవులు అనుభవించి, ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎలా అయ్యారు ? అంటూ ప్రశ్నించడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో కడియంకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా.. కేసీఆర్ పిలిచి డిప్యూటీసీఎం పదవి, రాజ్యసభ సీటు ఇచ్చారని గుర్తుచేశారు.
అయినప్పటికీ వెన్నుపోటుకు మారు పేరుగా నిలిచారని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ వరకు అందరికీ వెన్నుపోటు పొడుచుకుంటూ, పార్టీలు మారుతూ వచ్చారని దుయ్యబట్టారు. రాజకీయ పదవులు, అధికారం కోసం ఆయన ఎన్ని పార్టీలైనా మారుతారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఇచ్చిన బీఫామ్పై గెలిచిన కడియంకు ఇజ్జత్ ఉంటే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమది సామంతుల జాతి కాదు అని, స్వతంత్రుల జాతి అని, బరి గీసి కొట్లాడే కేసీఆర్ జాతి అని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయని, అందులో ఒకటి తెలంగాణవాదుల జాతి అయితే, రెండోది తెలంగాణ ద్రోహుల పార్టీ అని విమర్శించారు.