సంగారెడ్డి : పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఓడిపోయామని కుంగిపోవద్దు..వచ్చే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చూపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao )అన్నారు. సంగారెడ్డి(Sangareddy)లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రమంతా కొంత ఇబ్బంది ఉన్నా సంగారెడ్డిలో మాత్రం ఈ సారి గులాబీ జెండా ఎగిరింది. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా కష్టపడి పని చేశారని ప్రశంసించారు.
అధికార పార్టీ వాళ్లు మన మానసిక స్టైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయినా ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో విజయాలు సాధించామన్నారు. 2004 లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణపై కేసీఆర్ కి ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదని పేర్కొనర్నారు. 14 ఏండ్లు కష్టపడి, పదవులు గడ్డి పోచల్లా వదిలేసి తెలంగాణ తెచుకున్నామని గుర్తు చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదు..లేనప్పుడు కుంగిపోలేదు. బీఆర్ఎస్ అధికార పక్షంలో ఉన్నా ప్రతి పక్షంలో ఉన్నా మనమెప్పుడు ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. తెలంగాణాని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీనేనని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. వాళ్లు మనకంటే బాగా చేయాలని కోరుకుందామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం కొట్లాడుదాం.
ప్రజల సమస్యలపై పోరాడే వారికే భవిష్యత్తు మనకే ఉంటుందని చెప్పారు. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడొద్దు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కలసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఓటమిపై సమీక్ష జరుపుదాం. తప్పొప్పులు సరి చేసుకొని ప్రజల పక్షాన నిలబడుదామన్నారు.