సంగారెడ్డి, మే 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి.. తన నాలుగు నెలల పాలనలోనూ తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డే ఇచ్చారని మాజీమంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని దౌల్తాబాద్, గుమ్మడిదల, బొల్లారంలో నిర్వహించిన రోడ్షోల్లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డే ఇచ్చిందని రేవంత్రెడ్డి చెప్తున్నారని, ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పదేండ్లుగా చెప్తూనే ఉన్నదని తెలిపారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, తులం బంగారం అని ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయని, వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. బోనస్ ధర చెల్లించి రైతుల నుంచి కాంగ్రెస్ సర్కార్ పంటలను ఎందుకు కొనుగోలు చేయటం లేదని నిలదీశారు. రైతులు, ప్రజలను మోసంచేస్తున్న కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. మతం పేరుతో బీజేపీ గెలవాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
బీజేపీ అభ్యర్థి దుబ్బాక ఉపఎన్నికల్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, దుబ్బాకలో చెల్లని రూపాయి ఈ ఎన్నికల్లో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మనకు అవసరమా? అని ప్రజలను అడిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఉన్నత విద్యావంతుడు, మాజీ కలెక్టర్ అయిన వెంకట్రామిరెడ్డి తన కుటుంబ ఆస్తి నుంచి రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.
ప్రజలకు మంచి చేయాలన్న తపన ఉన్న వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. రోడ్షోలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.