ఆత్మగౌరవం అంటూ బీరాలు పలికే ఈటల రాజేందర్.. దమ్ముంటే కేసీఆర్ చలవతో, కారు గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సవాల్ విసిరారు. మాటిమాటికీ అత్మగౌరవం అని చెప్పే ఈటలకు నిజంగా అదే ఉంటే ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. ఈటలకు వ్యతిరేకంగా వారంతా కలిసికట్టుగా కదులుతున్నారు. తాముండేది టీఆర్ఎస్లోనే.. నడిచేది కేసీఆర్ బాటలోనే అని తేల్చి చెప్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులంతా నాలుగు రోజులుగా తమ వైఖరి స్పష్టం చేస్తున్నారు. తమకు ఈటల ముఖ్యం కాదు.. పార్టీయే ముఖ్యమంటూ కుండబద్దలు కొడుతున్నారు. సామాన్య కార్యకర్త మొదలుకొని ప్రథమ శ్రేణి ప్రజాప్రతినిధుల వరకు అందరి నోట ఇదేమాట వినిపిస్తున్నది. రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తే రాజేందర్కు మాకు తేడా ఉండదన్న విషయాన్ని నొక్కి చెప్తున్నారు. రాజేందర్ను మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాతనే హుజూరాబాద్లో రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందని పలువురు నాయకులు బాహాటంగానే ప్రకటిస్తున్నారు.
కరీంనగర్ మే 15 (కరీంనగర్ ప్రతినిధి): ప్రాణాలను పణంగాబెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలోనే మున్సిపల్ పాలకవర్గం పనిచేస్తున్నదని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టే తమకు ముఖ్యమని, వ్యక్తులు కాదని చెప్పారు. శనివారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించి, ఆకుపచ్చని తెలంగాణగా మార్చిన సీఎం కేసీఆరే తమ నాయకుడని స్పష్టంచేశారు. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్తో మాట్లాడి మున్సిపల్కు నిధులు తెచ్చుకుంటామని, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. ఈటల రాజేందర్తో ఏ ఒక్క నాయకుడూ పనిచేయడని, టీఆర్ఎస్లోనే ఉంటామని కౌన్సిలర్, మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య స్పష్టంచేశారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఎంపీపీ హోదాలో ఉండి కూడా తాను ఈటల రాజేందర్తో చాలా ఇబ్బందులు పడ్డానని జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమతాప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. 2001 నుంచి పార్టీ అందించిన అనేక పదవులను పొందిన ఈటల.. అదే పార్టీని విమర్శించడం తగదని హితవుపలికారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు నివాసంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే ఈటల తాను కూర్చున్న చెట్టును తానే నరుక్కున్న వ్యక్తిగా అభివర్ణించారు. ఈటల ఇప్పటికైనా మంచి మనుసుతో మారాలని, పార్టీ కోసం పనిచేయాలని కోరారు. కొత్త పార్టీ పెడతారని ప్రచారాలు చేయడం తగదని హితవు పలికారు.
తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన టీఆర్ఎస్ వెంటే తాను ఉంటానని, సీఎం కేసీఆర్ను విమర్శిస్తే తగిన బుద్ధిచెప్తామని కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో తాను గతంలో జమ్మికుంట జడ్పీటీసీ సభ్యురాలిగా, కౌన్సిలర్గా ఎన్నికయ్యానని, ప్రస్తుతం ఇల్లందకుంట జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి జడ్పీ చైర్పర్సన్గా ఎన్నికవడానికి టీఆర్ఎస్ పార్టీయే కారణమని ఆమె స్పష్టంచేశారు. ఇప్పటికి, ఎప్పటికీ తాను టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటానని స్పష్టంచేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని, సీఎం కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదని, తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఈటలకు ఆత్మగౌరవమే లేదని, పదేపదే ఆత్మగౌరవం అంటూ ఆ పదానికున్న విలువ తీసేస్తున్నారని, ఇకనైనా అలాంటి మాటలు, మానుకోవాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మొలుగు పూర్ణచందర్ హితవుపలికారు. శనివారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ టికెట్పై గెలిచిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారని, కేసీఆర్ బాటలోనే పయనిస్తారని స్పష్టంచేశారు. అసెంబ్లీలో, ప్రెస్మీట్లలో అనేకసార్లు పదవులను గడ్డిపోచలెక్క విసిరేస్తాం.. అన్న ఈటల రాజేందర్.. దమ్ముంటే కేసీఆర్ చలవతో, కారు గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలువాలని, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. పార్టీ ముఖ్యం కానీ వ్యక్తులు కాదని అన్నారు. కేసీఆర్ బొమ్మతో కారు గుర్తుపై గెలిచింది మరచి, రాజకీయ భిక్ష ప్రసాదించిన ముఖ్యమంత్రి మీదనే ఈటల కుట్రలు చేయడం, ప్రభుత్వంలో ఉంటూ కుట్రలు చేయడం, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, సంక్షేమ పథకాలపై ఎద్దేవా చేయడం దారుణమన్నారు. బీసీల పథకాలపై కామెంట్లు చేయడం వారిని అవమాన పరచడమేనని మండిపడ్డారు.
టీఆర్ఎస్వీ నాయకుడు బాసవేణి ప్రవీణ్యాదవ్పై మంత్రి హోదాలో ఈటల రాజేందర్ తప్పుడు కేసులు పెట్టించి, పోలీసులతో కొట్టించి ఆయన మరణానికి కారణమయ్యాడని టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జి అలేటి శ్రీరామ్ ఆరోపించారు. ప్రవీణ్ మృతిచెందితే కనీసం ఇంటికి వెళ్లి పరామర్శించలేదని, ఆయనపై విమర్శలు వస్తే కనీసం అవి నిజం కాదని నిరూపించుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. ప్రవీణ్ యాదవ్, ఆయన కుటుంబం టీఆర్ఎస్ వెంట ఉన్నప్పటికీ దవాఖానలో ఆయన నౌకరి తీసేయించి, చిత్రహింసలకు గురిచేసి ఆయన చావుకు కారణం అయింది నీవు కాదా .. అని ఈటలను నిలదీశారు. ఈటల వంటి మోసగాడు నియోజవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే లేడని ఆరోపించారు. నిన్నమొన్న టీఆర్ఎస్లో చేరిన కొందరు ఈటలకు మద్దతుగా మంత్రి గంగులను, సీఎంను, ఎంపీ కెప్టెన్ను, పార్టీని విమర్శించడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. చీమునెత్తురు ఉంటే, ఉద్యమ నాయకుడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవా ల్ విసిరిరారు. సమావేశంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు సామల రాజారెడ్డి, పోతరవేని అనిల్యాదవ్, కాపర్తి సంతోష్, టీఆర్ఎస్వీ హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు శ్రీరామ్, రాజేశ్, జగన్, కిరణ్, వినయ్, శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.