బోయినపల్లి, ఏప్రిల్ 26 : ‘అయ్యో కొడుకా.. ఇంటికొచ్చి నాల్రోజులన్నా కాకపాయెకదరా.. ఎంత పనాయెరా..’ అంటూ ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఆ కొడుకు మృతదేహంపై ఆ తల్లి.. ‘కండ్ల ముందే ఘోరం జరిగిపోయింది బిడ్డా’ అంటూ ఆ తండ్రి రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం జరిగిన ఈ ఘటన విషాదం నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలం తడగొండకు చెందిన చేపూరి గంగయ్య-తిరుమల దంపతులకు ఇద్దరు కొడుకులు మణితేజ(12), రిత్విక్ ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ తమ కొడుకులను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. మణితేజ గంగాధర మండలం కురిక్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాల హాస్టల్లో ఉంటూ 7వ తరగతి , రిత్విక్ తడగొండలోనే నాలుగో తరగతి చదువుతున్నాడు. కాగా, నాలుగు రోజుల కిందట వేసవి సెలవులు ఇవ్వడంతో మణితేజ ఇంటికి వచ్చాడు.
శుక్రవారం తండ్రి గంగయ్యతో కలిసి ఈత నేర్చుకునేందుకు అదే గ్రామంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈత నేర్చుకుంటున్న క్రమంలో మణితేజ నీట మునిగిపోయాడు. తన కండ్ల ముందే కొడుకు బావిలో మునిగిపోవడంతో ఆ తండ్రి హతాశుడయ్యాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కరీంనగర్ నుంచి రెస్క్యూటీం చేరుకుని బావిలో నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు. ఎస్ఐ పృథ్వీధర్గౌడ్ కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.