జనగామ, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. పాలకుర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలపై ఆదివారం నిర్వహించిన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల విస్తృత సమావేశం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధ్యక్షతన జరిగింది.
స్టేషన్ఘన్పూర్, జనగామ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరైన ఈ సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. నాయకులు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల మెజారిటీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గానికి వేల కోట్ల నిధులు తెచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. మంజూరైన నిధులను అడ్డుకుంటే ధర్నాలు తప్పవని హెచ్చరించారు.
కాంగ్రెస్, బీజేపీలది మిలాఖత్ రాజకీయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇరు పార్టీల రహస్య మైత్రి బయట పడిందని ఆరోపించారు. గవర్నర్ రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా కోదందరాంను ఎమ్మెల్సీగా ఎలా అంగీకరించారో గవర్నర్ చెప్పాలని ప్రశ్నించారు. కోదండరాం ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పోటీ చేశారని గుర్తుచేశారు. ప్రొఫెసర్ దాసోజ్ శ్రావణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే గవర్నర్ అడ్డుకున్నారని తెలిపారు. రంగనాయక సాగర్పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. అక్రమ కేసులు, అవిశ్వాసాలకు భయపడేది లేదని చెప్పారు.
సర్పంచ్ ఎన్నికలంటే కాంగ్రెస్కు భయమని అందుకే పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికలను పక్కన పెట్టి అవిశ్వాసాలకు తెరలేపిందని మండిపడ్డారు. కాంగ్రెస్వి అమలు కానీ హామీలని విమర్శించారు. 50 రోజుల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయని, రైతుబంధుకు రాంరాం చెప్పారని ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు, నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటుతామని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఉద్యమ పార్టీగా అవతరించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకగా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. త్యాగాల పునాదిపై అవతరించిన బీఆర్ఎస్ను వందమీటర్ల లోతులో తొక్కడం, 39 ముక్కలు చేయడం సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అబ్బతరం కూడా కాదని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడే భాష మార్చుకోవాలని సూచించారు.
రేవంత్రెడ్డి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సంగతి మర్చిపోయి కాంగ్రెస్ కార్యకర్తలా మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని తెలిపారు. రేవంత్ చరిత్ర తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసని, ఆయన గురించి కొత్తగా మాట్లాడాల్సిన పనిలేదని చెప్పారు. సభ్యత, సంస్కారం మర్చిపోయి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావును విమర్శించడం మంచిది కాదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులపై విమర్శలు మానుకొని ప్రజాపాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడం రేవంత్రెడ్డితో సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానివి మాటలు తప్ప చేతల్లో పని కావడం లేదన్నారు. కొద్దిరోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని కడియం వ్యాఖ్యానించారు.