పాలకుర్తి, మే 31: కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేండ్ల పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని, అన్ని రంగాల్లో మోసం చేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఆదివారం ఆయన జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు(జే)లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కన్నీరు పెడుతూ ఎర్రబెల్లికి తమ గోస చెప్పుకొన్నారు. వెంటనే స్పందించిన ఎర్రబెల్లి.. కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు. స్పందించిన కలెక్టర్ త్వరలోనే కొనుగోళ్లు పూర్తి చేస్తామని, ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని కలెక్టర్ ఎర్రబెల్లిని కోరారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రేవంత్రెడ్డిది దొంగ ప్రభుత్వమని, రైతులను నిండా ముంచుతున్నదని విమర్శించారు. సకాలంలో లారీలు అందించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులు ఎర్రటి ఎండలో ధాన్యం పోసుకొని కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వానకాలం వచ్చినా వడ్లు కొనరా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు.