రాయపర్తి/నెల్లికుదురు/జఫర్గఢ్, ఏప్రిల్ 25 : రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడాప్రాంగణం ఆవరణలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ నిర్వహిస్తున్న మక్కల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. కాంటాలు పెట్టడం లేదని, అవసరమైన గన్నీ సంచులు ఇస్తలేరని, పంటను కూడా కల్లంలోనే ఉంచడంతో రోజుల తరబడి కాపలాగా ఉండాల్సివస్తున్నదని రైతులు ఎర్రబెల్లితో వాపోయారు. మక్క రైతుల కష్టాలు విని చలించిపోయిన ఎర్రబెల్లి వెంటనే కలెక్టర్ సత్యశారద, మార్క్ఫెడ్ డీఎంతో ఫోన్లో మాట్లాడారు. రైతుల కష్టాలను వివరించి వెంటనే మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు అవసరమైన గన్నీ సంచులు సరఫరా చేయాలని, కాంటాలు వేసిన మక్కలను గిడ్డంగులకు తరలించాలని సూచించారు.
అనంతరం రైతుల విజ్ఞప్తి మేరకు మక్కల కొనుగోలు కేంద్రం వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులతో కలిసి బైఠాయించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులను రేవంత్రెడ్డి సర్కార్ అరిగోస పెడుతున్నదని విమర్శించారు. రైతు భరోసా, రైతుబీమా, పంటల కొనుగోలు, సాగు జలాల సరఫరా, యూరియా బస్తాల నిల్వ, వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్తును అందజేయడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ఢిల్లీకి సంచులు మోయడంలోనే రేవంత్రెడ్డి బిజీగా మారారని ఎద్దేవా చేశారు. మక్క రైతులతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు.
మునిగలవీడులో బీఆర్ఎస్ ధర్నా
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడంలో అధికారుల నిర్లక్ష్యం వీడాలని డిమాండ్ చేస్తూ శనివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు నెల్లికుదురు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. 2 గంటలపాటు ధర్నా నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఎస్సై చిర్ర రమేశ్బాబు పోలీసు సిబ్బందితో వచ్చి బీఆర్ఎస్ నాయకులు, రైతులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నల్లాని నవీన్రావు మాట్లాడుతూ.. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
జఫర్గఢ్లో రాస్తారోకో..
మక్కలు, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా జఫర్గఢ్లో రైతులు శనివారం రాస్తారోకో చేపట్టారు. జఫర్గఢ్-వర్ధన్నపేట ప్రధాన రహదారిపై మండుటెండను సైతం లెక్క చేయకుండా గంటపాటు బైఠాయించారు. దాదాపు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. పలువురు రైతులు మాట్లాడుతూ.. జఫర్గఢలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు గింజ కూడా కొనలేదని విమర్శించారు.