సిద్దిపేట/ గజ్వేల్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నమ్మి ఓటేసిన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. శుక్రవారం మెదక్ జిల్లా పాపన్నపేట, శంకరంపేట మండలకేంద్రాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశాల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి పీ వెంకట్రామిరెడ్డి, పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి హరీశ్రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అది చేస్తాం, ఇది చేస్తామని ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిన కోతలరాయుడు రేవంత్రెడ్డి అని విమర్శించారు. వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి క్వింటాల్ను రూ.2,500 కొంటామని చెప్పి ఆ ఊసే మరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సీఎం వ్యవసాయం మీద కాకుండా రాజకీయ వలసలపై దృష్టిసారించారని ఆరోపించారు. హామీలను అమలుచేయని కాంగ్రెస్కు రానున్న ఎన్నికల్లో ప్రజలు సురుకు పెట్టాలని కోరారు. రైతుబంధు కింద పెంచుతామని చెప్పిన రూ.15 వేలు ఏమయ్యాయని నిలదీశారు. రైతులకు కేసీఆర్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తే, రేవంత్ మాత్రం వారిని చివరన పడేశారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు కరెంటు, నీళ్లు పుషలంగా అందాయని, రైతుబంధు, రైతుబీమాతో చేయూత లభించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు మొదలయ్యాయని, తాను మాట్లాడుతుండగా కరెంట్ పోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలను చెల్లిస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని, ఈ నాలుగు నెలల కాలంలో మరో డీఏ పెండింగ్ పడిందని మొత్తం నాలుగు డీఏలను చెల్లించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. మార్చి 31న చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా మూడేండ్లపాటు బాండ్లు ఇస్తామని లీకులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏసీబీతో దాడులుచేయిస్తున్నదని ఆరోపించారు.
ఒక్క ముస్లింకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ వారిని మోసం చేసిందని హరీశ్రావు పేర్కొన్నారు. ముస్లింలు లేకుం డా ప్రభుత్వం ఉండదనే ఆనవాయితీకి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడిందని మండిపడ్డారు. పదేండ్లలో రంజాన్ మాసం లో గిఫ్ట్ల పంపిణీ ఎప్పుడూ ఆగలేదని, కానీ ఈసారి ప్రభుత్వం చేతకాక ఇవ్వలేదని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంక్రటామిరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పదేండ్ల బీజేపీ పాలనలో పేదరికం, నిరుద్యోగం పెరిగిందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని హరీశ్రావు ఆరోపించారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎలక్షన్ కోడ్ రాజకీయాలు, బీజేపీ ఈడీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో తాము ప్రభుత్వాన్ని నిలదీసి దాని మెడలు వంచాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని హరీశ్రావు కోరారు. పార్లమెంటు ఎన్నికలు, జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కారునే గెలిపించాలని పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డి మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని మోసం చేశారని, అకచెల్లెళ్లు కారు మీద ఓటు గుద్దితే రేవంత్ గూబ గుయ్యిమనాలని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారని, వచ్చే లక్ష కూడా రావడం లేదని తెలిపారు. నిరుద్యోగులకు రూ.4 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడేమో ఆ హామీ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పారని మండిపడ్డారు. ఆడపిల్లలకు ఇస్తామన్న సూటీని కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.