పెద్దపల్లి : తెలంగాణ ప్రభుత్వాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram project)ను అప్రదిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ఢిల్లీ పెద్దల ఆదేశాలతో అధికారులు నివేదికను రూపొందించినట్టుగా కనబడుతున్నదని ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ రెండు పిల్లర్ల కుంగుబాటుపై పెద్దపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాగునీటి శాఖ అక్టోబర్ 25, 29 తేదీలలో, నవంబర్ 1 న సమర్పించిన సమాచారాన్ని సమగ్రంగా అధ్యయనం చేయకుండానే హడావుడిగా నివేదికను రూపొందించినట్టుగా కనబడుతున్నదని ఆరోపించారు.
NDSA వారు అడిగిన 20 అంశాలకు గానూ 17 అంశాలకు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందించినట్లు వివరించారు. మిగతా 3 అంశాలకు సంబందించిన సమాచారం త్వరలో సమర్పిస్తామని పేర్కొన్నారు. వాటి కోసం వేచి చూడకుండానే హడావుడిగా నివేదికను వండి వార్చడంలో వారి ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
బ్యారేజీ పిల్లర్లు కుంగి పోవడానికి ఒకటి కాదు అనేక కారణాలు ఉన్నాయని.. ప్లానింగ్, డిజైనింగ్, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, నిర్వాహణ లోపాలు అంటూ నివేదికలో రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నమే తప్పా బ్యారేజీ పునరుద్ధరణకు నిర్మాణాత్మక సూచనలు చేయడంలో నివేదిక విఫలమైందన్నారు.