Nalgonda | నార్కెట్పల్లిలో పులి కనిపించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఈ ప్రాంతంలో పులి సంచారానికి ఏమాత్రం అవకాశం లేదని అటవీశాఖ స్పష్టం చేసింది. ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పులి సంచారానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు. చిరుత పులికి సంబంధించిన సమాచారం గుర్తించలేదని తెలిపారు.
చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ఎంసీ పర్గెయిన్ జిల్లా అటవీ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో పులి సంచరించే అవకాశం లేదని అటవీ అధికారులు పేర్కొన్నారు. కొందరు పక్క రాష్ట్రాలకు చెందిన పులి సంచారం వీడియోలను ఈ ప్రాంతానికి చెందినదిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఆ వార్తలను నమ్మొద్దని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఎక్కడైనా పులితో పాటు, వన్యప్రాణుల సంచారం తెలిస్తే అటవీశాఖ టోల్ ఫ్రీ నంబర్ 18004255364 ఫోన్ చేయాలని లేదంటే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ కోరింది.