హైదరాబాద్ సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 5 (నమస్తే తెలంగాణ): కరోనాతో గణనీయంగా తగ్గిన విదేశీ పర్యాటకం.. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకొంటున్నది. అంతర్జాతీయంగానూ విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు ఎత్తేయడంతో భారత్.. అందులోనూ తెలంగాణకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ఆరు నెలల్లోనే వీరి సంఖ్య నాల్గింతలు పెరుగడం విశేషం. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్న విదేశీయులు.. తదుపరి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యం ఇస్తుండటం మరో విశేషం.
హైదరాబాద్కు ప్రాధాన్యం
భారత్ను సందర్శించే విదేశీయులు తమ యాత్రలో తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి ఏటా లక్షల మంది వచ్చి వెళ్తారు. తెలంగాణ పర్యాటకశాఖ రికార్డులు పరిశీలిస్తే.. 2019 వరకు అంటే కరోనా ముందు వరకు ఏటా వీరి సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2014లో 75 వేలు, 2016లో 1.60 లక్షలుగా ఉన్న వీరి సంఖ్య 2019లో 3.19 లక్షలకు చేరుకొన్నది. 2020లో కరోనా ప్రభావం మొదలుకావడం.. మార్చిలో లాక్డౌన్, అంతర్జాతీయంగా రాకపోకలపై నిషేధంతో ఒక్కసారిగా విదేశీ పర్యాటకుల రాక నిలిచిపోయింది. ఆ తర్వాత ఏడాది సడలింపులు ఇచ్చినా.. పర్యాటకుల సంఖ్య ఆరు వేల లోపునకే పరిమితమైంది. ఈ ఏడాది మాత్రం వీరిసంఖ్య క్రమంగా పెరుగుతున్నది. పర్యాటకశాఖ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆరు నెలల్లోనే గత ఏడాది వచ్చిన విదేశీయుల సంఖ్య కంటే నాల్గింతలు ఎక్కువ నమోదైంది.
మూడు ప్రాంతాలకే మొగ్గు
తెలంగాణకు వచ్చే విదేశీ పర్యాటకులు ప్రధానంగా మూడు ప్రాంతాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్ నగరంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. నగరంలోని చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ, హుస్సేన్సాగర్, కుతుబ్షాహీ టూంబ్స్, ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలతోపాటు వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతాల పర్యటనపై మక్కువ చూపుతున్నారని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాకే జై కొడుతున్నారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో గుర్తింపు దక్కిన నేపథ్యంలో విదేశీ పర్యాటకులు రామప్ప, ఖిలా వరంగల్, వేయి స్తంభాల గుడిని సందర్శిస్తున్నారు. దీంతోపాటు లక్నవరం, బొగత జలపాతాలను చూసేందుకు వస్తున్నారు.