హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధానిలోని పాతబస్తీ ప్రాంతంలో మెట్రో రైలు మార్గం నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ కసరత్తు ప్రారంభించింది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కారిడార్-2 పనులు జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మొత్తం 15 కిలోమీటర్లు నిర్మించతలపెట్టారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 9.5 కి.మీ మేర పనులు గతంలోనే పూర్తయ్యాయి. మిగతా 5.5 కి.మీ మేర ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు పనులు చాలాకాలంగా పెండింగ్లో ఉన్నాయి. నిలిచిపోయిన పనులను పూర్తి చేసేందుకు ఇప్పుడు కార్యాచరణ సిద్ధం చేశారు.
5 మెట్రో స్టేషన్ల నిర్మాణానికి ఏర్పాట్లు…
ఎంజీబీఎస్ నుంచి దారుల్షిఫా జంక్షన్, పురాణీ హవేలీ, ఇత్తేబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దైరా, హరీబౌలి, శాలిబండ, శంషీర్గంజ్, అలియాబాద్ ప్రాంతాల మీదుగా ఫలక్నుమా వరకు 5 స్టేషన్లు ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్గంజ్, ఫలక్నుమా ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మించాలని సూత్రపాయంగా నిర్ణయించారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ ప్రాంతాల్లో నిర్మించనున్న స్టేషన్లు ఆ కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉంటున్నప్పటికీ, రెండు కట్టడాలకు నగర చరిత్ర ఎంతో ప్రాముఖ్యత ఉన్నందున ఆ పేర్లే స్టేషన్లకు పెట్టామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
103 కట్టడాలను పరిరక్షిస్తూ మెట్రో మార్గం నిర్మాణం…
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పాతబస్తీలో మెట్రో రైలు పనులకు సన్నాహాలు చేపట్టామని ఎండీ తెలిపారు. పాతబస్తీలోని మెట్రో మార్గంలో మొత్తం 103 కట్టడాలు మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు. ఇందులో 21 మసీదులు, 12 ఆలయాలు, 12 అషుర్ ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశానవాటికలు, 6 చిల్లాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో ఫిల్లర్ లొకేషన్లలో తగిన మార్పులను ఇంజినీరింగ్ పరిష్కారాల ద్వారా చేపడుతున్నామని చెప్పారు. 4 చోట్ల తప్ప మిగతా అన్ని నిర్మాణాలను పరిరక్షిస్తూ మెట్రో మార్గం వేస్తామని చెప్పారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు సూచనల మేరకు సమస్యాత్మక 4 మతపరమైన నిర్మాణాలను సైతం కాపాడేలా మెట్రో అలైన్మెంట్కు ఇంజినీరింగ్ ద్వారా పరిష్కారాలు చూస్తామని తెలిపారు. ఈ మార్గంలో రోడ్డు వెడల్పు 80 అడుగులకు పరిమితం చేశారని వెల్లడించారు. మొదటి దశలో భాగంగా మెట్రో స్టేషన్లు నిర్మించిన మిగతా ప్రాంతాల్లో 120 అడుగుల మేర విస్తరిస్తామని తెలిపారు. విస్తరణ పనుల్లో ప్రభావితం అయ్యే దాదాపు 1000 ఆస్తుల వ్యక్తిగత స్కెచ్ల తయారీ ప్రక్రియ ప్రారంభించామని, నెల రోజుల్లో భూ సేకరణ నోటీసులు జారీ చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.