Nagarjuna Sagar | హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో సాగర్ 22 గేట్లు ఎత్తి దిగువకు 1.7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 2.94 లక్షల క్యూసెక్కులు, ఔట్ఫ్లో 2.22 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 302.91 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా స్థిరంగా వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,95,563 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,46,374 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం 10 స్పిల్ వే గేట్లు ఎత్తి 2,75,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 209.15 టీఎంసీలుగా ఉంది.