Musi River | కేతేపల్లి : ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 38,852 క్యూసెక్కులు రాగా.. 9 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి 57 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మధ్యాహ్నం తర్వాత ఇన్ఫ్లో తగ్గడంతో 8 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 19,217 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 21,319 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. కుడి కాల్వకు నీటిని నిలిపివేయగా, ఎడమ కాల్వకు 141 క్యూసెక్కులు వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 641.00 (3.45 టీఎంసీలు) అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లోను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. దిగువకు భారీగా నీటిని వదిలినందున నదిలోకి రైతులు, మత్స్యకారులు, గొర్రెలు, మేకల కాపరులు వెళ్లవద్దని అధికారులు సూచించారు.