సింగూర్ బ్యాక్ వాటర్లో మునిగిన వందలాది ఎకరాల పంట పొలాలు
భయం గుప్పిట్లో మంజీరా నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు
న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల మీదుగా ప్రవహించే మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు రావడంతో.. మంజీరా ఉరకలేస్తోంది. మంజీరా నది తీర ప్రాంతంలోని హుస్సేన్ నగర్, చీకుర్తి, అమీరాబాద్, చాల్కి రాఘవపూర్, కాకి జన్వాడ గ్రామాల శివారులోని పంట పొలాల్లోకి సింగూర్ బ్యాక్ వాటర్ రావడంతో పంటలు పూర్తిగా నీటిలో మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఆయా గ్రామాల శివారులోకి బ్యాక్ వాటర్ రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చికుర్తి గ్రామం వద్ద బ్యాక్ వాటర్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాఘవపూర్ గ్రామ శివారులోని మంజీరా నది తీరంలోని గంగా మాత ఆలయం చుట్టూ వరద నీరు చేరింది.