భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం గోదావరిలో 52.20 అడుగుల వద్ద వరద ప్రవహిస్తోంది. గోదావరిలో 13,80,071 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం రాత్రి నుంచి సుమారు 2 అడుగులు తగ్గింది. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరికనే కొనసాగుతోంది. నిన్న భారీ వరద పోటెత్తడంతో కల్యాణకట్ట, హనుమాన్ దేవాలయం నీట మునిగాయి.
సీఎం కేసీఆర్ సూచనల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే సోమవారం రాత్రి బస చేశారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అక్కడి పరిస్థితులను సీఎంకు ఫోన్ ద్వారా వివరించారు. మంగళవారం ఉదయం గోదావరి వంతెన, కరకట్ట వద్ద గోదావరి నదీ ప్రవాహం, పునరావాస కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ప్రస్తుతం నీటి మట్టం తగ్గుముఖం పడుతున్నప్పటికీ అధికారులు తేలికగా తీసుకోవద్దని, అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పువ్వాడ సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, ఆహారం, తాగునీరు, మెడిసిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతూ.. బ్లీచింగ్ శానిటేషన్ చేయలని అదేశించారు.