ట్రై-సిటీ (వరంగల్, హనుకొండ, ఖాజీపేట)కి ఆనుకొని ఉంటది వర్ధన్నపేట నియోజకవర్గం. ఉమ్మడి పాలకులు నిధులు కేటాయించక పూర్తిగా వెనుకబడ్డది. నాడు అనేక గ్రామాలకు సరైన రోడ్డు కూడా లేదు. సాగు, తాగునీటి వనరులూ లేవు.కానీ, తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.2,700 కోట్ల నిధులు వెచ్చించడంతో అభివృద్ధి అడుగు పడింది. మడికొండ ఐటీపార్కు జిల్లాకే తలమానికంగా మారింది. దేవాదుల, శ్రీరాంసాగర్ సాగు నీటితో వర్ధన్నపేట సస్యశ్యామలమైంది.
వర్ధన్నపేట, అక్టోబర్ 26: సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైన వర్ధన్నపేట ప్రగతి బాట పట్టింది. తొమ్మిదేండ్లలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ రూ.2,700 కోట్ల నిధులు వెచ్చించడంతో దశాబ్దాల సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆకేరువాగుపై చెక్డ్యాంల నిర్మాణం, పర్వతగిరి పెద్దచెరువును మినీ రిజర్వాయర్గా మార్చడం, వర్ధన్నపేట కోనారెడ్డి, హసన్పర్తి చెరువులతోపాటు ఇతర చెరువులకు మరమ్మతులు చేయించి దేవాదుల, శ్రీరాంసాగర్ సాగు నీటిని సరఫరా చేయిస్తుండటంతో నియోజకవర్గ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
నియోజకవర్గంలోని మడికొండ ఐటీ పార్కు జిల్లాకే తలమానికంగా మారనున్నది. సైయంట్, టెక్మహీంద్ర, జెన్ప్యాక్ట్, కాకతీయ, వెంటాయిస్ వంటి కంపెనీలు ఇక్క కార్యకలాపాలు ప్రారంభించాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీల రాకతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం పెరగనున్నాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలకు రహదారులు ఏర్పడ్డాయి. గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు.
ప్రతి గ్రామంలో ఇంటింటికీ స్వచ్ఛమైన జలాలు మిషన్ భగీరథ ద్వారా అందుతున్నాయి. సంక్షేమ పథకాల ద్వారా నియోజకవర్గానికి సుమారు రూ.1400 కోట్ల మేర ప్రజలకు లబ్ధి చేకూరింది. గ్రామ పంచాయతీగా ఉన్న వర్ధన్నపేటను ప్రభుత్వం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసింది. రూ.104 కోట్లు మంజూరు చేసింది. అంబేద్కర్ సెంటర్ ఆధునీకరించింది. మున్సిపాలిటీ నూతన భవనం, జూనియర్ కళాశాలకు నూతన భవనం, రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేశారు.
పట్టణంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ప్రభుత్వం 100 పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేసింది. వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లి, ల్యాబర్తి, పర్వతగిరి మండలంలోని రోళ్లకల్లు వద్ద రూ.54 కోట్లతో మూడు బ్రిడ్జి కమ్ చెక్డ్యాంలను నిర్మించింది. నందనం, ఇల్లంద, వర్ధన్నపేట సమీపంలో ఉన్న చెక్డ్యాంలకు రూ.10 కోట్లతో మరమ్మతులు చేయించారు. తద్వారా భూగర్భ జలాలు పెరగడంతోపాటుగా వాగు పరీవాహకంలోని భూములకు సమృద్ధిగా సాగునీరు లభిస్తున్నది. ఐనవోలు మల్లికార్జునస్వామి, మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయాల్లో వసతులు పెంచడంతో కొత్తశోభ సంతరించుకున్నాయి.