హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు శనివారం 48 వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా, ఆదివారం సాయంత్రం నాటికి 86 వేలకు పెరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన ప్రాణహిత నుంచి భారీ వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎగువన బరాజ్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇంద్రావతి, తాలిపేరు పొంగిపొర్లుతుండటంతో భద్రాచలం వద్ద మళ్లీ గోదావరిలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. కృష్ణానదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. తుంగభద్ర నుంచి వరద తగ్గినా, జూరాల నుంచి వరద భారీగానే వచ్చి శ్రీశైలంలో చేరుతున్నది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ఇప్పటికే 200 టీఎంసీలకు చేరుకున్నది. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో వరద కొనసాగుతూనే ఉన్నది. దీంతో డ్యాం గేట్లను ఎత్తి దిగువన సాగర్కు విడుదల చేస్తున్నారు.