PM Modi | నిజామాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర సర్కారుకు పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో చిత్తశుద్ధి కొరవడింది. 2019 సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ పెద్దలే నిజామాబాద్ జిల్లాకు వచ్చి పసుపుబోర్డు ఏర్పాటుపై హామీలు గుప్పించారు. అధికారాన్ని దక్కించుకున్న తర్వాత లోక్సభ, రాజ్యసభల్లో పసుపుబోర్డు ఏర్పాటే ఉండబోదంటూ ప్రకటన ఇప్పించారు. సీన్ కట్ చేస్తే మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో, అంతకు మునుపు తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ నేతలంతా పసుపు పేరుతో రాజకీయం చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీనే ఒక అడుగు దిగొచ్చి పసుపుబోర్డును తప్పక ఏర్పాటు చేస్తామంటూ ప్రకటన చేశారు. అక్టోబర్ ఒకటిన మహబూబ్నగర్ సభలో, అక్టోబర్ మూడున నిజామాబాద్ సభలో రెండుమార్లు ఇదే అంశాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. స్వయంగా దేశ ప్రధానే ప్రకటన చేయడంతో పసుపుబోర్డు ఏర్పాటు తథ్యమని అంతా భావించారు. మోదీ హామీకి ఐదు నెలలు నిండినా ఇప్పటికీ ఆ ప్రక్రియకు అతీగతీ లేకుండాపోయింది. సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించేందుకు మోదీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో పసుపుబోర్డు మరోమారు చర్చనీయాంశంగా మారింది.