ప్రభుత్వం ప్రతి ఏడాది మాదిరిగానే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేస్తున్నది. అందుకు సంబంధించిన ప్యాకెట్లు సిద్ధం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తు ఓ వైపు బతుకమ్మ చీరెలు, మరోవైపు క్రిస్మస్, రంజాన్ కానుకలు అందజేస్తున్నది. పేదలు పండుగ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్ధేశ్యంతో రంజాన్ తోఫాను అందజేస్తున్నది. దీనిలో భాగంగా నల్లగొండ ఉమ్మడి జిల్లాకు 19,500 కానుకలు వచ్చాయి. ఎంపిక చేసిన మసీదు కమిటీల్లో సభ్యులు కొవిడ్ నిబంధనలతో వీటిని అందజేయనున్నారు. ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేస్తారు.
పేదలకు అండగా సర్కార్…
గత సంవత్సరం కరోనా కష్టకాలంలోనూ బతుకమ్మ, క్రిస్మస్ కానుక, రంజాన్ కానుకలను ప్రభుత్వం అందజేసింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నిమతాలను సమానం గౌరవిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిఒక్కరికి అండగా నిలుస్తున్నది.
ఉమ్మడి జిల్లాలకు 19,500 తోఫాలు
రంజాన్ సందర్భంగా ప్రభుత్వం అందించే రంజాన్ తోఫాలు జిల్లాకు చేరాయి. వాటిని ఆయా నియోజకవర్గలో నిల్వ ఉంచారు. ఎన్నికల కోడ్ ముగిసినందున పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో చూస్తే నల్లగొండ 2,500, మిర్యాలగూడ 2వేలు, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 1500 చొప్పున అందజేయనున్నారు.
హుజూర్నగర్లో పంపిణీ షురూ
రంజాన్ను పురస్కరించుకుని హుజూర్నగర్లోని ఉస్మానియా మసీద్లో సోమవారం ముస్లింలకు రంజాన్ తోఫాను తాసీల్దార్ జయశ్రీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలను జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన గెల్లి అర్చనారవి, ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీవుల్లా, మసీద్ కమిటీ అధ్యక్షుడు ఎండీ రహీం, కార్యదర్శి గౌస్, ఎండీ షఫీ, కాశీంఖాన్, యూసుఫ్, అక్బర్, నయీం, సలావుద్దీన్, మాజిద్అలీ, జానీమియా పాల్గొన్నారు.