ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 20 : ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పుష్కలంగా సాగు, తాగునీటిని ఇచ్చి ప్రజలను సంతోషంగా ఉంచాం. నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపూరిత వాగ్దానాలు, మాయమాటలు నమ్మి ఓటేసి గెలిపిస్తే పంటలకు సాగునీరు బంద్ అయ్యాయి. గుక్కెడు తాగునీటికి సైతం కాంగ్రెస్ కష్టాలు తెచ్చిపెట్టడంతో నేడు ప్రజలు కన్నీరు కార్చే పరిస్థితి నెలకొంది.’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి ఆత్మకూర్.ఎస్ మండలం నెమ్మికల్లో శనివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అంతకుముందు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డితో కలిసి దండు మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు.
అనంతరం కోలాటాలు, డప్పుచప్పుళ్లతో దండు మైసమ్మ ఆలయం నుంచి నెమ్మికల్ పశువుల సంత చౌరస్తా వరకు సుమారు పది వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సూచించారు. నాలుగు నెలల క్రితం వేసిన ఓటు ఏమి తెచ్చింది.. పదేండ్ల క్రితం వేసిన ఓటు ఏమి తెచ్చిందో ప్రజలు ఒకసారి ఆలోచించాలన్నారు. జిల్లాలో ఇద్దరు పనికిరాని దద్దమ్మ మంత్రులున్నారని, పంటలు పూర్తిగా ఎండిపోయేలా చేశారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో తానొక్కడినే మంత్రిగా ఉండి సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేశానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 24గంటల కరెంట్, సాగునీరు, తాగునీరు అందించిన ఘనత తమదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు నీళ్లు ఇవ్వక పొలాలు ఎండిపోవడమే కాకుండా వచ్చిరాని కరెంట్తో మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు. 2014కు ముందు రైతులు బావుల ద్వారా వ్యవసాయం చేసేవారని అప్పుడు వేలాది ఎకరాలు ఎండిపోయాయని, మళ్లీ నేడు అదే పరిస్థితి వచ్చిందని అన్నారు. జిల్లా మంత్రులు పట్టించుకోకుండా వ్యాపారులు, మిల్లర్లు, క్రషర్ మిల్లర్ల వద్ద డబ్బు వసూలు చేస్తూ వ్యాపారం చేస్తున్నారు తప్ప పంటను కొనుగోలు చేయాలనే సోయి లేదని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అడిగిన వారిని చెప్పుతో కొడుతామని మాట్లాడుతూ వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు రూ.2500, నిరుద్యోగులకు రూ.4వేల భృతి, పింఛన్ రూ.4వేలు, కల్యాణలక్ష్మి తులం బంగారం, విద్యార్థినులకు బ్యాటరీ స్కూటీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. ఈ పథకాల్లో ఏ ఒక్కటి అమలు చేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, అమలు కాకుంటే బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో పొలాలు ఎండిపోయి రైతులకు సుమారు రూ.600 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. వారిని పట్టించుకునే నాథుడే లేడన్నారు. కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇదే అవకాశమని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి రాంచంద్రనాయక్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నరసింహారావు, నాయకులు చంద్రారెడ్డి, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, యాదగిరి, సత్యనారాయణరెడ్డి, జానయ్య, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.
అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి మోసం చేసింది. శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేని దద్దమ్మ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించింది. రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి, నిరుద్యోగ భృతి ఏమైందో చెప్పాలి. రైతుబంధు ఇవ్వలేదు. మనమంతా కలిసికట్టుగా పని చేసి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
– బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు రైతులు, ప్రజల సమస్యలు తెలుసు. వాటి పరిష్కారం కోసం పార్లమెంట్లో తెలంగాణ గళం విప్పేందుకు సైనికుడిలా పని చేస్తా. ప్రజలంతా ఆశీర్వదించి గెలిపిస్తే మీలో ఒకడిగా ఉండి పని చేస్తా. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లి తన గొంతును వినిపిస్తా. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించండి.
– కంచర్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి