నీలగిరి,ఏప్రిల్ 20 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని బారీ మెజార్టీతో గెలిపించి పార్టీ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండలో శనివారం కంచర్ల నివాసంలో బీఆర్ఎస్ ప్రచార రథాలను వారు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీమాంధ్రుల కబంద హస్తాల నుంచి తెలంగాణను విడిపించి బంగారు తెలంగాణగా మారిస్తే నేడు వంద రోజుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను అతలాకుతలం చేసింది విమర్శించారు. రాష్ట్రంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేపట్టిన విధానాలను ప్రజలకు వివరించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కటికం సత్తయ్యగౌడ్, మాజీ ఎంపీపీ నారబోయిన భిక్షం నాయకులు దేప వెంకట్రెడ్డి, నాయకులు పుట్ట కోటయ్య, సింగం రామ్మోహన్ పాల్గొన్నారు.