హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రూ. 3 కోట్ల విలువ చేసే 1,820 కిలోల గంజాయిని ప్రత్యేక పోలీసు బృందాలు సీజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న సంజయ్ బాలకి కాలే(30), అభిమన్ కల్యాణ్ పవార్(40), సంజయ్ చౌగులే(45), భరత్ కొలప్ప యేవ్లే(37), షేక్ రహీదుల్(27)ను పోలీసులు అరెస్టు చేశారు. షేక్ రహీదుల్ది వెస్ట్ బెంగాల్ కాగా, మిగతా నలుగురిది మహారాష్ట్ర. మరో నిందితుడు సంజయ్ లక్ష్మణ్ షిండే(26) పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
షేక్ రహీదుల్ గంజాయి స్మగ్లింగ్ వాహనానికి డ్రైవర్గా పని చేస్తున్నాడు. సంజయ్ లక్ష్మణ్ షిండే గంజాయి రవాణాను మానిటర్ చేస్తూ.. పోలీసులకు దొరక్కకుండా ప్లాన్ చేస్తుంటాడు. సీలేరులో కిలో గంజాయిని రూ. 2 వేలకు కొనుగోలు చేసి, మహారాష్ట్రలో కిలో గంజాయిని రూ. 8 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక గంజాయిని రవాణా చేస్తున్న రహీదుల్కు మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నాడు షిండే.